ఈ నెల 13, 14 తేదీల్లో (రేపు, ఎల్లుండి) నిర్వహించబోవు శాసనసభ, శాసనపరిషత్తు సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు కలిసి పరిశీలించారు. సభలో సభ్యుల మద్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులును వారు ఆదేశించారు.
సమావేశాల బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్తో, సమావేశాలలో అవసరమైన సమాచారంపై చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం ఫోన్ లో మాట్లాడారు. సమావేశాలకు హాజరయ్యే శాసనసభ, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంధి, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిలలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా ఉభయ సభల ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలలో తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా సూచించారు.