కుమ్మక్కులు.. జిమ్మిక్కులు!

44
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రాన్ని సర్వం దోచుకునేందుకు దోపిడీ పార్టీలన్నీ ఏమౌతున్నాయి. దేశంలో 16 సార్లు అధికారంలోకి వచ్చి దోపిడికి కేరాఫ్ అడ్రస్ గా మారిన కాంగ్రెస్ కు మరికొన్ని దోపిడి పార్టీలు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రజలు అలెర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చిందని రాజకీయ అతివాదులు హెచ్చరిస్తున్నారు. ఆకులు నాక్కునే వాడికి మూతులు నాక్కునే వాడు తోడైనట్లు కాంగ్రెస్ కు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, టీడీపీ.. వంటి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు రాజన్న బిడ్డనని, రాజన్న పాలన తెస్తానని.. కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు చూసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అనూహ్యంగా ఎన్నికల రేస్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు మద్దతు పలికింది. హస్తం పార్టీ నుంచి అందుకున్న ప్యాకేజ్ కారణంగానే ఆమె ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఇక టీడీపీ విషయానికొస్తే చంద్రబాబు జైలుకు వెళ్ళిన తరువాత తెలంగాణలో ఆ పార్టీ ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు ఎన్నికల రేస్ లో ఉండాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు అండగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపిన సంగతి విధితమే. ఇప్పుడు కూడా హస్తం పార్టీతో పరోక్షంగా దోస్తీ కొనసాగించేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు మరో దోపిడీ పార్టీ బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఆల్రెడీ ఏపీలో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణలో కూడా పొత్తు కొనసాగించేందుకు అడుగులు వేస్తున్నట్లు టాక్. మొత్తానికి బి‌ఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు దోపిడి పార్టీలన్నీ ఏకం అవుతూ రాష్ట్రాన్ని దోచుకునేందుకు గోతి కాడి నక్కల్లా వ్యూహాలు పన్నుతున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం.

Also Read:CM KCR:ముగిసిన రాజశ్యామల యాగం

- Advertisement -