తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు.
ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం , ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
సీసీ కెమెరాల నిఘాతోపాటు కంట్రోల్ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు సహా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని రిటర్నింగ్ అధికారులు సూచించారు.
Also Read:రేవంత్కు మతిభ్రమించింది: సతీష్ రెడ్డి

