ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ నేత సోమవారం ఉదయం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అక్టోబర్11న ములాయం స్వగ్రామం సాయ్ఫాయ్లో జరగనున్న అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రేపు ఉత్తరప్రదేశ్కు వెళ్లనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించి… ములాయం సొంత గ్రామంలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
ములాయం మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం.. తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.