తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. మంచిరోజు, ముహూర్తం చూసుకోందే ఏ పనీ ప్రారంభించరు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10 వసంతపంచమి రోజున కేబినెట్ విస్తరణ దాదాపుగా కన్ఫామ్ అయినట్లే అని ప్రచారం జరిగింది. అంతేగాదు మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోబోతున్నారు వారి శాఖల పేర్లతో లీకులు కూడా వచ్చాయి. కానీ తీరాచూస్తే అవన్నీ గాసిప్సే అని తేలిపోయింది.
దీంతో అసలు కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగనుంది అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే కేబినెట్ విస్తరణపై కేసీఆర్ సుదీర్ఘ సమాచాలోచనలు జరుపుతున్నారట. సామాజికవర్గాల వార్గాల సమీకరణతో అన్నిజిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారట సీఎం.
అయితే ఈసారి పరిమిత సంఖ్యలోనే మంత్రివర్గవిస్తరణ జరగనుండటంతో కేబినెట్లో యువతకు లేదా రెండు, మూడుసార్లు గెలిచిన నేతలకు అవకాశం ఇస్తే బాగుంటుందని సీఎం భావిస్తున్నారట. సీనియర్లను లోక్ సభ ఎన్నికల బరిలో దింపితే త్వరలో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే కేబినెట్ విస్తరణ కాస్త ఆలస్యమైన పార్టీలో ఎలాంటి అసంతృప్తులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దీంతో పాటు త్వరలో జరగబోయే మండలి ఎన్నికలు,ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్,పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ విస్తరణ ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. ఫిబ్రవరి నాలుగోవారంలో బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఈ లోపే విస్తరణ జరగనుందని పార్టీ నేతలకు చెప్పారట కేసీఆర్.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మహమూద్ అలీ మాత్రమే కేబినెట్లో ఉన్నారు. జిల్లాల వారీగా మంత్రిపదవిని ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే అంశాన్ని సన్నిహిత నేతలతో కూడా కేసిఆర్ చర్చించట్లేదట. సో మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి మూడోవారంలో జరిగే అవకాశం ఉందని టాక్.