వరదలపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్‌

68
review
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా మ‌రో 3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులను సీఎం కేసీఆర్ అప్ర‌మ‌త్తం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. గోదావరి నది, దాని ఉప న‌దులు కూడా నిండి ప్ర‌వ‌హిస్తున్నాయ‌ని చెప్పారు. మ‌రో రెండు, మూడు రోజులు భారీ వ‌ర్షాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. మొన్న‌టి వ‌ర‌ద‌ల కంటే ఎక్కువ‌గా వ‌ర‌ద‌లు సంభ‌వించే ప్ర‌మాదం ఉంద‌ని సీఎం హెచ్చ‌రించారు.

వ‌ర్ష‌పు నీరు వాగులు, వంక‌లు, కుంట‌లు, చెరువుల‌కు చేరుతోంద‌న్నారు. ఇప్పుడు కురిసే వాన‌ల‌తో ఎల్లుండి వ‌ర‌కు గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హించే అవకాశం ఉంద‌న్నారు. ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను దాటి న‌ది ప్ర‌వ‌హించే అవ‌కాశం ఉన్నందున, గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం, ఎస్సారెస్పీ, కడెం నుంచి వస్తున్న వ‌ర‌ద‌ను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివ‌రించారు.

వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు. వాతావరణ శాఖ వానలను అంచనా వేసింది, కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతున్నదని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి సీఎం వివ‌రాలు తెలుసుకున్నారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్న నేప‌థ్యంలో.. ఇది అధికార యంత్రాంగానికి ప‌రీక్షా స‌మ‌యం లాంటింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడద‌ని ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -