టీడీపీ కి షాక్‌.. టీఆర్‌ఎస్‌లో చేరిన మండవ

251
TDP leader Mandava
- Advertisement -

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గత కొంతకాలంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎన్నికల్లో ఓటమిని పక్కనబెడితే అధికార టీఆర్ఎస్ పార్టీలోకి నాయకుల వలసల కారణంగా టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మండవ వెంకటేశ్వరరావు కూడా సైకిల్‌ దిగి.. కారెక్కారు.

కాగా సీఎం కేసీఆర్‌ నిన్న స్వయంగా హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ మండవకు కండువా కప్పి పార్టీలోకి ఆహ‍్వానించారు.

ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ కీలకపాత్ర పోషించారు. ఆయన డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, నిజామాబాద్‌ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ టీఆర్‌ఎస్‌లో చేరడంతో నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో అధికార పార్టీకి బలం పెరిగినట్లు అయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడం లేదు.

ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు మిగిలున్న కేడర్‌ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా మండవను పార్టీలోకి ఆహ్వానించింది.

- Advertisement -