తెలంగాణలోని రెండు రాజ్యసభ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. పార్టీ సీనియర్ నేతలు కే కేశవరావు, సురేష్ రెడ్డిలను అభ్యర్థులగా ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కేకేకు మరోసారి అవకాశం కల్పించారు.నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కేకే…ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా జాతీయ రాజకీయాలను సమన్వం చేసే బాధ్యతలను చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కేకే సేవలను ఉపయోగించుకోవడం కోసం 2014లో పెద్దలసభకు పంపిన సీఎం కేసీఆర్…తాజాగా మరోసారి అవకాశం కల్పించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సురేశ్ రెడ్డి. వైఎస్ హయాంలో స్పీకర్గా పనిచేశారు. 1984లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి…1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.