కోల్‌కతాపై హైదరాబాద్‌ గెలుపు..

110
Sunrisers Hyderabad
- Advertisement -

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్లో ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొట్టింది. ఐపీఎల్‌లో భాగంంగా నిన్న రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. ఈ పరాజయంతో కోల్‌కతా నాలుగో స్థానానికి పడిపోయింది.

176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు ఆరంభం అంత కలిసిరాలేదు. 3 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (3), 39 పరుగుల వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17) అవుటయ్యారు. అయితే, క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి, మార్కరమ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. బంతిని నిర్దాక్షిణ్యంగా బాది స్టాండ్స్‌లోకి తరలించారు. ఫలితంగా హైదరాబాద్ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు.. కేకేఆర్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ సూపర్ బౌలింగ్‌కు ఓ దశలో తక్కువ స్కోరుకే పరిమితమవుతోందనుకున్న కేకేఆర్ ఇన్నింగ్స్ ను నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ ఆదుకున్నారు. నితీష్ రాణా ( 36 బంతుల్లో 54 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ ( 25 బంతుల్లో 49 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించారు. హైదరాబాద్‌లో నట్టూ మూడు వికెట్లతో దుమ్మురేపగా, ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లతో తన పేస్ సత్తా చాటాడు.

- Advertisement -