ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి… ఫ్రాన్స్లోని లియాన్ నగరంలో ఉన్న లూమియర్ మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంను మరియు అక్కడ హౌస్ఫుల్ ప్రదర్శనలతో తన చిత్రాలు ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శించబడిన స్క్రీనింగ్ రూమ్ను ఆయన వీక్షించారు. అనంతరం అక్కడి ప్రతిష్టాత్మక ‘ముర్ డెస్ సినీస్టెస్’ (వాల్ ఆఫ్ ఫిల్మ్మేకర్స్) పై రాజమౌళి పేరుతో కూడిన ఫలకాన్ని ఆవిష్కరించి ఆయనను ఘనంగా గౌరవించారు.
రాజమౌళి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్లోని లియాన్ నగరంలో ఉన్న లూమియర్ మ్యూజియంను, అలాగే ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు హౌస్ఫుల్ షోలతో ప్రదర్శించబడిన స్క్రీనింగ్ రూమ్ను సందర్శించాను అని రాశారు.
ఇన్స్టిట్యూట్ లూమియర్ మరియు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ అయిన థియరీ ఫ్రెమాక్స్ స్వయంగా తనను ప్రేక్షకులకు పరిచయం చేశారని, ఆపై సినిమా పుట్టిన గడ్డగా భావించే ఆ వీధిలో తనకు ప్రత్యేక పర్యటన చేయించారని రాజమౌళి తెలిపారు.
ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇన్స్టిట్యూట్ లూమియర్ మరియు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ ఎంతో గౌరవంతో నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ ఉందని చెబుతూ, సినిమా పుట్టిన ఆ వీధి గుండా నన్ను నడిపించారు. నా చుట్టూ జరుగుతున్న వాటన్నిటికీ నేను అప్పటికే చాలా భావోద్వేగానికి లోనయ్యాను అని రాజమౌళి తెలిపారు.
ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన ‘ముర్ డెస్ సినీస్టెస్’ పై నా పేరు శాశ్వతంగా ఉండేలా ఈ గౌరవాన్ని అందించినందుకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పగలను. మనస్ఫూర్తిగా వినమ్రుడినై తలవంచుతున్నాను అని రాజమౌళి తెలిపారు. నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించినందుకు ఇన్స్టిట్యూట్ లూమియర్కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.
Also Read:ఇండోనేషియాకు ప్రధాని మోదీ

