TTD:వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

26
- Advertisement -

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర శ‌నివారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ సందర్భంగా టిటిడి నుండి మూడు లక్ష్మీ హారాలను స్వామి వారికి అందించినట్లు తెలిపారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పెష్కార్ శ్రీ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

Also Read:బీజేపీ అంటేనే బీసీల పార్టీ!

ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని శ్రీనివాస మంగాపురంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

- Advertisement -