సీఎం కేసీఆర్ సహకారం పూర్తిగా ఉంది- చిన్న జీయర్

66
- Advertisement -

రేపు ముచ్చింతల్ శ్రీరామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లోని మూర్తులకు జరిగే శాంతి కళ్యాణంపై చిన్న జీయర్ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల శాంతి కళ్యాణం జరగనుంది. గత 12 రోజుల పాటు శ్రీ రామానుజ సహస్రాబ్ది, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం జరిగిందన్నారు. 14న సాయంత్రం శాంతి కల్యాణం జరగాల్సింది.. ఋత్విజులను సత్కరించటం కోసం వాయిదా వేశాం..సహస్రాబ్ది ఉత్సవాలకు అందరూ సహకరించారు.. మీడియా పాత్ర అనన్య సామాన్యం అన్నారు. రామానుజ మూర్తిని, 108 దివ్య ఆలయలను రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 వరకు దర్శనం చేసుకోవచ్చు. ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒకే చోట 108 సన్నిధుల శాంతి కళ్యాణం జరగడం చరిత్రలో లేదు.. ఇదో అపూర్వమైన ఉత్సవం కాబోతోందని తెలిపారు.

అన్ని ఆలయాలను ఒకే దగ్గర దర్శించుకోవడం అద్భుతం. కల్యాణ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు చారిత్రాత్మకంగా జరిగిన అద్భుతమైన సన్నివేశం.. సమతా భావం విదేశీయులకంటే ముందే వందల ఏళ్ల క్రితమే మనం దేవాలయాల ద్వారా చాటిచెప్పాము. మాకు అందరూ సమానమే.. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అంతా సమానమే.. మేము అందరినీ ఆహ్వానించాము..సీఎం కేసీఆర్ సహకారం పూర్తిగా ఉంది.. వారి సహకారం ఉంది కాబట్టే.. అద్భుతంగా కార్యక్రమం చేశామన్నారు.ఉత్సవాలకు నీళ్లు, విద్యుత్ వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించారు.ముఖ్యమంత్రితో విభేదాలు లేవు.. విభేదాలు సృష్టించడం సరికాదు అని జీయర్‌ స్వామి తెలిపారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాకుండా.. అరబిక్, స్పానిష్ భాషలోనూ ఆహ్వాన పత్రికను రూపొందించాం..సమతా మూర్తి, 108 దివ్య దేశాల దర్శనం, స్వర్ణ మూర్తి దర్శనానికి ఎంట్రీ టికెట్.. పెద్దలకు150, పిల్లలకు 75రూపాయలుగా నిర్ణయించాం. రామానుజ మూర్తిని ప్రధాని ప్రారంభించాలని 6 ఏళ్ల క్రితం నిర్ణయించాం..ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే సమయానికి సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత ఉంది.. అందుకే ఆయన రాలేకపోయారు. ప్రధాని కార్యక్రమంలో సీఎం పాల్గొన లేదు కాబట్టి.. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని పేరు మాత్రమే శిలాఫలకంపై పెట్టామని స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అన్ని రకాల సహకారం అందించారు కాబట్టే.. ఉత్సవాలు విజయవంతం అయ్యాయి.. లేకుంటే పవర్, మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయేవి.. అన్ని వేల మంది పోలీసుల పని చేసి ఉండేవారు కాదు అని చిన్న జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

- Advertisement -