కేంద్రం అదనపు నిధులు మంజూరు చేయాలి..

167
- Advertisement -

కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. శాసనసభ లోని స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు శాసనసభ కార్యదర్శి డా వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ… కరోనా మహమ్మారితో భారతదేశంతో పాటుగా ప్రపంచ ప్రజలందరికీ ఇది అత్యంత క్లిష్టమైన సమయం. ఈ మహమ్మారి నిర్మూలనకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రవేశం సమయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా నివారణపై శాసనసభలో లఘు చర్చ జరిపాం. శాసనసభ సమావేశాల రోజులను తగ్గించి శాసనసభ్యులను, అధికారులను క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి పంపించడం జరిగింది.

లాక్ డౌన్ ప్రకటించగానే రాష్ట్రంలో ఉన్న 80 శాతం పేదల బతుకు తెరువుకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలోని 87 లక్షల 59 వేల వైట్ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబంలోని ఒక్కొకరికి 12 కేజీల చొప్పున 2 కోట్ల 80 లక్షల మందికి బియ్యం అందించడం జరిగింది. అదేవిదంగా ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రతి కుటుంబానికి రూ. 1500 చొప్పున బ్యాంకుల ద్వారా నగదును పంపిణీ చేయడం జరిగింది. అదేవిదంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు కూడా మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు రూ. 500 లను అందించడం జరిగింది. వలస కూలీలను ఆదుకోవడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నది. మొత్తం కరోనా కేసులలో 22 శాతం మంది చికిత్స తరువాత ఆరోగ్య వంతులుగా డిశ్చార్జి అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 2.44 శాతం మంది మాత్రమే మృతి చెందారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు.

కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున పరికరాలను, ఇతర వసతులను కల్పించింది. 3 లక్షల PPE కిట్స్, N-95 కిట్స్ 3 లక్షలు, 36.5 లక్షల 3ప్లై మాస్క్ లు, 15,807 మంది అదనపు మెడికల్ స్టాఫ్ ను సమకూర్చడం జరిగింది. కరోనా రోగులకు ఆధునిక వైద్యం అందించడానికి గచ్చిబౌలిలో 1500 పడకలతో ప్రత్యేక హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి గ్రామ పంచాయతీ సెక్రటరీ వరకు అందరూ కష్ట పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దేశంలోనే అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ గా తమరు దేశ ప్రధానమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రాలకు అదనపు నిధులను మంజూరు చేయించగలరని నా మనవి అన్నారు.

- Advertisement -