సెంటిమెంట్ గెలిచింది. స్పీకర్ ఓడిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసి తర్వాతి టర్మ్లో గెలిచిన దాఖలాలే లేవు. తాజాగా అదే సెంటిమెంట్ రిపిటైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి పోటీచేసిన ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఓటమిపాలయ్యారు.కొడెలపై వైసీపీ నేత అంబటి రాంబాబు విజయబావుట ఎగురవేశారు.
రాజకీయాల్లో రెండు సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలవరని సెంటిమెంట్ ఉంటే హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన వారు కూడా గెలవరని మరోసెంటిమెంట్ ఉంది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్ మధుసుదనాచారి సైతం ఓటమి పాలయ్యారు. 1994 నుండి ఇదే సెంటిమెంట్ రిపిటైతూ వస్తోంది. స్పీకర్లుగా డి శ్రీపాదరావు,ప్రతిభా భారతి,సురేష్ రెడ్డి,నాదెండ్ల మనోహర్, యనమల రామకృష్ణుడు ఓటమిపాలయ్యారు. తర్వాత పలు ఎన్నికల్లో వీరు పోటీచేసినా గెలుపుమాత్రం దక్కలేదు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. రాజకీయాలకు దూరమయ్యారు.
మొత్తంగా తెలుగురాష్ట్రాల్లో స్పీకర్గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందుతున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.