బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన..

76
rain
- Advertisement -

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల కదలికలతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అస్సాంలో వర్షం, వరదల కారణంగా వందమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలావుంటే..వచ్చే నెల 3వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో 6వ తేదీ నాటికి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. పడమర తీరంలో దక్షిణ గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి కొనసాగుతోంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించిందని, వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి రుతుపవన గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దీని ఫలితంగా ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు, కోస్తా, రాయలసీమల్లో నిన్న పలుచోట్ల వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బయటకి వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వాహణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందికి వెళ్లకూడదని సూచించారు.

- Advertisement -