అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ల మధ్య మాటల యుధ్ధం కొనసాగుతూనే ఉంది. తాను తలచుకుంటే ఉత్తర కొరియాను సర్వ నాశనం చేస్తానని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర కొరియా కొట్టి పారేసింది.
తాజాగా ట్రంప్ హెచ్చరికలను కుక్క అరుపులతో పోల్చుతూ.. కుక్కల అరుపులు కొనసాగుతున్నా తమ నడక ఆగదని, విలేకరుల ప్రశ్నకు జవాబుగా చెప్పారు రీ యాంగ్ హో.
ఇటువంటి అరుపులను తాము పట్టించుకోబోమని అన్నారు. ‘కుక్క అరుపులతో వారు మమ్మల్ని బెదిరించాలని చూస్తే.. అది శునకస్వప్నమే అవుతుంది’అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉత్తర కొరియాను ఒంటరి చేయాలన్న ఏ దేశపు ఎత్తుగడలూ సాగబోవన్నారు.
తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసునని, అణు క్షిపణి సామర్థ్యం పెంచుకోవాలన్న నిర్ణయం దేశ భద్రత కోసమేనని స్పష్టం చేశారు. ఎన్నో దేశాలు తమకు మద్దతుగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.