సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

