టీబీజీకేఎస్ నాయకత్వంలో కార్మికుల ఆందోళన..

217
TBGKS
- Advertisement -

బొగ్గు గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) భగ్గుమంది. వేలాది కార్మికులకు ప్రత్యక్షంగా,లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాది కల్పించే బొగ్గు గనులను కాపాడుకునే లక్ష్యంతో జంగు సైరన్ ఊదింది.తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత పిలుపుమేరకు హైదరాబాద్, కోల్ బెల్ట్ ఏరియాల్లో టీబీజీకేఎస్ నాయకత్వంలో కార్మికులు పెద్దసంఖ్యలో ఆందోళనలు చేశారు. తెలంగాణ కొంగుబంగారం సింగరేణీని ప్రైవేటీకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మికులు తగులబెట్టారు.

విదేశీ కంపెనీలకు దోచిపెట్టడానికే మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల ప్రైవేటీకరణను ముందుకుతెచ్చిందని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు. సుదీర్ఘ కాలం సమ్మెలు చేసి డిమాండ్లు నెరవేర్చుకున్న ఘన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉందని, ప్రైవేటీకరణ విషయంలో మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కార్మికుల సత్తా చూపిస్తామన్నారు. జూలై 2న జరిగే 24 గంటల సమ్మెలో టీబీజీకేఎస్‌ పాల్గొంటుందని ప్రకటించారు.

కోల్ బెల్ట్ లోని అన్ని గనుల దగ్గర టీబీజీకేఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో నేడు సింగరేణి కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, జయశంకర్ భూపాలపల్లి, మందమర్రి, గోదావరిఖనిలోని బొగ్గు గనుల వద్ద సింగరేణి కార్మికులు తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీబీజీకేఎస్‌ నిరసనలకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి.

- Advertisement -