సింగరేణిలో 1,478 కొత్త నివాస గృహాల నిర్మాణం..

230
Singareni CMD N Sridhar
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచనపై సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం కొత్త సౌకర్యవంతమైన క్వార్టర్లను నిర్మిస్తోందని దీనిలో భాగంగా తొలి దశలో 333 కోట్ల రూపాయాలతో 1,478 క్వార్టర్లను నిర్మిస్తున్నామని, వీటిలో 352 గృహాలు జూన్‌ నెల నాటికి పూర్తికానుండగా మిగిలినవి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి కార్మికులకు కేటాయిస్తామని సింగరేణి సంస్థ ఛైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగులందరికీ కంపెనీ క్వార్టర్లలోనే నివాసం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త క్వార్ట్లర్ల నిర్మాణాలను చేపడుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రతీ క్వార్టరులో రెండు బెడ్‌ రూమ్‌ లు, హాలు, కిచెన్‌ – కాలనీల్లో పచ్చదనం

గతంలో సింగరేణి కార్మికుల క్వార్టర్లు కేవలం ఒక బెడ్‌ రూం, ఒక చిన్న హాలు, చిన్న కిచెన్‌ కలిగి చాలా ఇరుకుగా ఉంటుండేవి. కాగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారి విధానాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కూడా కొత్తగా నిర్మించే కార్మికుల క్వార్టర్లలో డబుల్‌ బెడ్‌ రూంతో పాటు హాలు, కిచెన్‌, కామన్‌ ఏరియాతో కలిపి 963 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. క్వార్టర్లకు మధ్య విశాలమైన రోడ్లు, డ్రైనేజీలతో పాటు రోడ్లకు ఇరువైపుల డివైడర్ల మధ్యలో వేలాది మొక్కల్ని నాటుతున్నారు. వీటితో పాటు పార్కులు, పిల్లలకు క్రీడ స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. క్వార్టర్ల నిర్మాణాన్ని కూడా ఆధునిక శైలిలో చేపడుతున్నారు.

భూపాలపల్లిలో 994 క్వార్టర్లు

కొత్తగా ఆధునిక తరహాలో నిర్మిస్తున్న 1,478 క్వార్టర్లలో ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే 994 క్వార్టర్లు 216 కోట్ల రూపాయాలతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకా కొత్త గనులు రానున్న నేపథ్యంలో గృహ వసతిని పెంచడం కోసం వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్వార్టర్ల నిర్మాణం బాధ్యతను ఓపెన్‌ టెండరు ప్రక్రియ ద్వారా కె.పి.సి. ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ వారికి అప్పగించారు. మంజూర్‌ నగర్‌ సమీపంలో ఈ క్వార్టర్ల నిర్మాణం ఒకే సారిగా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నిర్మాణం పనులను సంస్థ డైరెక్టర్లు (ఆపరేషన్స్‌ & పా) శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) శ్రీ ఎన్‌.బలరామ్‌ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్వార్టర్లను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిచేసి కార్మికులకు కేటాయించనున్నారు.    

సత్తుపల్లి 352 క్వార్టర్లు జూన్‌ కల్లా సిద్దం

కాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్యోగుల కోసం 80 కోట్ల రూపాయాలతో నిర్మిస్తున్న 352 క్వార్టర్ల నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నిర్మాణాపు పనులను టెండర్‌ ప్రక్రియ ద్వారా బింద్రా-సిరి అనే నిర్మాణ సంస్థకు అప్పగించారు. మరో 5 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి కానుందని అధికారులు తెలియజేశారు. సింగరేణి సంస్థ సత్తుపల్లిలో భారీ ఓపెన్‌ కాస్ట్‌ను ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. రోజుకి ఇక్కడ నుండి సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుండి ఒక రైలు మార్గాన్ని కూడా కంపెనీ చేపట్టింది. ఈ గనుల నుండి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో కార్మికుల సౌకర్యం కోసం కంపెనీ క్వార్టర్లను నిర్మిస్తోంది.

ఇవే కాకుండా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సుమారు 37 కోట్ల రూపాయాల వ్యయంతో నిర్మిస్తున్న మరో 132 క్వార్టర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరుకొంది.

ప్రతీ ఒక్కరికీ కంపెనీ నివాస గృహం

సింగరేణి సంస్థలో కొన్నేళ్ల క్రితం 60 నుండి 70 శాతం మంది కార్మికులకు మాత్రమే కంపెనీ క్వార్టర్లు కేటాయించేవారు. మిగిలిన వారు స్వంత గృహాలలో లేదా అద్దె ఇళ్లలో ఉంటుండేవారు. కాగా కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగికి కంపెనీ క్వార్టరును కేటాయించాలన్న ఉద్దేశానికి అనుగుణంగా సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా కొత్త క్వార్టర్లు నిర్మిస్తువస్తోంది. దీంతో ఇప్పుడు కార్మికుల సంఖ్యకు తగినన్ని క్వార్టర్లు అందుబాటులోకి వచ్చాయనీ, ఇప్పుడు సుమారు 49 వేల నివాస యోగ్యమైన క్వార్టర్లు వివిధ ఏరియాల్లో ఉన్నాయనీ జనరల్‌ మేనేజర్‌ (సివిల్‌) శ్రీ సి.హెచ్‌.రమేష్‌ బాబు తెలిపారు. కొత్తగా నిర్మించే క్వార్టర్లు విశాలంగా, సౌకర్యవంతంగా ఉండనున్నాయనీ, ప్రతీ క్వార్టర్ల సముదాయాలలో అందమైన పార్కులు, షాపింగు కాంప్లెక్సులు నిర్మిస్తున్నామనీ ఆధునిక అవసరాలకు తగినట్టుగా సముదాయాల నిర్మాణం ఉంటోందని వివరించారు. సంస్థ సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశంపై డైరెక్టర్ల సూచన మేరకు నిర్మాణం పనులు వేగవంతం చేశామని, క్వార్టర్ల అప్పగింత తర్వాత కానీ సుందరీకరణ, పారిశుధ్యం వంటి పనులకు కూడా ఇప్పటికే  ప్రణాళికలు సిద్దం చేశామని, ఆదర్శ వంతమైన కాలనీలుగా వీటిని తీర్చిదిద్దనున్నామని ఆయన తెలిపారు.
- Advertisement -