‘#90’s’ చాలా అందమైన కథ:శివాజీ

22
- Advertisement -

హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్ ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో ఆరంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. శివాజీ లెక్కల మాస్టర్‌ చంద్రశేఖర్‌ గా అలరించారు. శివాజీ కుటుంబం, ఇల్లు, స్కూల్‌లో పిల్లల అల్లరి .. ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా వున్నాయి. ట్రైలర్ లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి శివాజీని పలకరిస్తూ, ‘నేను సుచిత డేవిడ్‌ పాల్‌’ అంటే, కాస్త ఆలోచించిన శివాజీ ‘నాకు కేఏ పాల్ తెలుసు’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటూ శివాజీ చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఆకట్టుకుంది. అమ్మ పాత్రలో వాసుకి ఆకట్టుకున్నారు. కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుని హత్తుకునేలా ట్రైలర్ లో చూపించారు దర్శకుడు ఆదిత్య హాసన్. 90వ దశకం నాటి పరిస్థితులను ప్రతింబించేలా సినిమాటోగ్రఫీ, సెట్స్‌ను తీర్చిదిద్దిన విధానం, సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా వున్నాయి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. #90’s చాలా అందమైన కథ. విన్న వింటనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది సెట్స్ పైకి వెళుతుందనగా నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఆ అవకాశం గురించి టీంతో చెప్పాను. నా కోసం ముందుగానే షూటింగ్ ని మొదలుపెటారు. బిగ్ బాస్ కంటే ముందు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈటీవీ విన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. #90’s ఎక్స్ ట్రార్డినరీ వెబ్ సిరిస్. దర్శకుడు ఆదిత్య చాలా అద్భుతంగా తీశారు. యంగ్ టీంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. నిర్మాత నవీన్ చాలా విజన్ వున్న టెక్నిషియన్. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారు. వాసుకి గారు చాలా ప్రతిభ వున్న నటి. ఇందులో నటించిన మౌళి, రోహన్, వసంతిక భవిష్యత్ లో చాలా మంచి నటులు అవుతారు. జనవరి 5 నుంచి ఈటీవిన్ లో విడుదలౌతుంది. తప్పకుండా చూడండి. మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

వాసుకి మాట్లాడుతూ.. దర్శకుడు ఆదిత్య, నిర్మాతలకు థాంక్స్. శివాజీ గారు ,మౌళి, వాసంతిక, రోహన్ ..ఇలా అందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. #90’s’ నేను చాలా కనెక్ట్ అయి చేసిన వెబ్ సిరిస్. మధ్యతరగతి కుటుంబాలు అంటే నాకు చాలా గౌరవం. చాలా బలంగా ధైర్యంగా ఆనందంగా వుంటారు. ఆదిత్య చాలా అద్భుతంగా తీశారు. ఇందులో అన్ని పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్నారు.ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’వేదికగా 2024 జనవరి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:కేవలం ప్రచారం కోసమే మేడిగడ్డ సందర్శన

- Advertisement -