నటసింహాం బాలయ్య నటిస్తున్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచే ఈ చిత్రాన్ని రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా… చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే హిస్టారికల్ మూవీని ఎంచుకున్నాడు. భారతదేశాన్ని పాలించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని.. ఈ సినిమాతో తెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఈ సినిమా విజయం సాధించాలని బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున్న పూజాలు జరిపిస్తున్నారు. ఇందులో బాగంగానే ఈరోజు ఫిలింనగర్లోని దైవసన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, క్రిష్, చిత్ర యూనిట్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దర్శకత్వం వహించడం తన అదృష్టమని అన్నారు. ఈ చిత్రంపై యూనిట్ మొత్తానికి పూర్తి విశ్వాసం ఉందని.. తప్పకుండా ఘనవిజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని బాలకృష్ణ తప్ప మరొకరు చేయలేరని అన్నారు. దాదాపు అన్ని పౌరాణిక పాత్రలు పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్కు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్ర తీరని కోరికగా మిగిలిపోయిందని.. దానిని ఆయన కుమారుడు నెరవేర్చారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్ 79రోజుల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు క్రిష్ వెల్లడించారు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం అభిమానుల అంచనాలకు అనుగుణంగా తెరకెక్కించినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి దేశం మొత్తానికి సంబంధించిన రాజని.. ఆయన చరిత్రను సినిమాగా తీయడం తన అదృష్టమన్నారు. మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ప్రస్తుతం రీరికార్డింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్ను డిసెంబర్ 16న విడుదల చేయాలని భావిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు.
ఇప్పటికే రిలీజైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్గా శ్రియా ప్రధాన భూమిక పోషిస్తోంది. సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా ఇద్దరు సీఎంల చేతుల మీదుగానే స్టార్ట్ చేశాడు బాలయ్య. టాలీవుడ్కు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా రాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.