తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా చర్యలలో భాగంగా దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో వివిధ సంఘాలు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు, ముట్టడులు జరిగే అవకాశముండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నేడు మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ అసెంబ్లీని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. గతంలో గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 531 కోట్ల బిల్లులను రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని మాజీ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల తమపై తీవ్ర ఆర్థిక భారం పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా కొంతమందిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అయితే పెండింగ్ బిల్లులు విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ సర్పంచ్లు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also read:శాంతి చర్చలు విఫలమైతే సైనిక మార్గమే!

