లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026కు సంతోష్‌ కుమార్‌కు ఆహ్వానం

9
- Advertisement -

వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అంతరిస్తున్న జీవవైవిధ్యంతో ప్రపంచం అల్లాడిపోతున్న వేళ.. పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ వేదికగా మొదలైన ఓ మహా ఉద్యమం ఇప్పుడు లండన్ గడ్డపై ప్రతిధ్వనించబోతోంది. మార్పు అనేది ప్రజలతోనే మొదలవుతుందన్న బలమైన సందేశాన్ని గ్లోబల్ వేదికలపై వినిపించేందుకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ (Green India Challenge) వ్యవస్థాపకుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సిద్ధమయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సిటిజన్-లెడ్ (ప్రజల భాగస్వామ్యంతో నడిచే) ఎన్విరాన్‌మెంటల్ మూవ్‌మెంట్‌కు నాయకత్వం వహిస్తున్న సంతోష్ కుమార్.. ‘లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026’లో పాల్గొననున్నారు. గ్లోబల్ గ్రీన్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన, యూకే పార్లమెంట్‌లో రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో “ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్”

పర్యావరణాన్ని కాపాడటంలో సామాన్య పౌరులు కూడా ఎలా భాగస్వాములు కావొచ్చో సంతోష్ కుమార్ నిరూపించారు. ఇదే అంశంపై జూన్ 23, 2026న వెస్ట్‌మిన్‌స్టర్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)లో జరిగే “ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్” (Playing for the Planet) పార్లమెంటరీ సదస్సుకు ఆయన కో-హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

లండన్‌కు చెందిన రాంఫాల్ ఇన్‌స్టిట్యూట్ (Ramphal Institute), ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్‌లో.. పలు దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, డిప్లమాట్స్, క్లైమేట్ లీడర్లు పాల్గొననున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, ప్రభుత్వాలు యాక్షన్ ప్లాన్‌లోకి ఎలా దిగాలన్న దానిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

ALso Read:‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు

మేయర్స్ క్లైమేట్ ఫోరమ్‌లో కీనోట్ అడ్రెస్

జూన్ 24, 2026న రెడ్‌బ్రిడ్జ్ మేయర్ (Mayor of London Borough of Redbridge) ఆధ్వర్యంలో జరిగే క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ లీడర్‌షిప్ ఫోరమ్‌లో సంతోష్ కుమార్ కీలక ప్రసంగం (Keynote Address) చేయనున్నారు. పర్యావరణ ఉద్యమంలో ఆయన చేసిన కృషిని మేయర్ ఆఫీస్ ప్రత్యేకంగా సత్కరించనుంది. ఈ పర్యటనలో ఆయన వెంట ఇగ్నైటింగ్ మైండ్స్ ఫౌండర్ ఎం.కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ సంజీవరాళ్ల రాఘవేందర్ కూడా పాల్గొంటున్నారు.

పర్యావరణానికి అండగా గ్రీన్ ఇండియా

సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమం అనూహ్యమైన
ఫలితాలను సాధించింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఇప్పటివరకు 196 మిలియన్ల (19.6 కోట్లు) మొక్కలు నాటారు. సుమారు 44 మిలియన్ల (4.4 కోట్లు) మంది పౌరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 33 దేశాల్లో 21,000 కు పైగా నీటిని ఒడిసి పట్టే మినీ జలాశయాలను నిర్మించారు. వేలాది చెరువులను పునరుద్ధరించి, ఏటా దాదాపు 3.57 టీఎంసీల నీటిని సంరక్షిస్తున్నారు.

వీటిని శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా మానిటర్ చేయడమే కాకుండా, భారత రాష్ట్రపతి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్‌కు UNFCCC COP29, UNCCD COP16 లలో అబ్జర్వర్ స్టేటస్ కూడా దక్కింది.

వసుదైవ కుటుంబం.. పౌరులే సైనికులు

“ఈ గుర్తింపు నా ఒక్కడిది కాదు. భూమి కోసం మొక్కలు నాటిన ప్రతి వాలంటీర్, ప్రతి పౌరుడు, ప్రతి చిన్నారికి దక్కుతుంది” అని సంతోష్ కుమార్ అన్నారు. “ప్రజలకు బాధ్యత అప్పగిస్తే, పర్యావరణంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో ఇండియా చేసి చూపించింది. ‘వసుదైవ కుటుంబకం’ (ప్రపంచమే ఒక కుటుంబం) స్ఫూర్తిని హైదరాబాద్ నుంచి వెస్ట్‌మిన్‌స్టర్ వరకు తీసుకెళ్లడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

డిసెంబర్‌లో ‘హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్’

లండన్ పర్యటన తర్వాత, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌ (HICC) వేదికగా హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్ (HCAW) 2026 జరగనుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు ఇదొక అతిపెద్ద క్లైమేట్ ప్లాట్‌ఫామ్‌గా నిలవబోతోంది.

వాతావరణ మార్పులపై పోరాటం కేవలం ప్రభుత్వాలు చేస్తే సరిపోదు, కోట్లాది మంది ప్రజలు ఏకమైతేనే అది సాధ్యం అని ఈ కార్యక్రమాలు నిరూపిస్తున్నాయి. పర్యావరణ రక్షణలో కమ్యూనిటీ-లెడ్ యాక్షన్ ద్వారా ప్రపంచానికే ఇండియా ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

- Advertisement -