అంబేడ్కర్ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి: మంత్రి కొప్పుల

187
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత, మహనీయులు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలు,పరిశోధనలు,ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఆలిండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, ఉపాధ్యక్షుడు వైద్యనాథ్ లు మంగళవారం మంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా వాళ్లు అంబేడ్కర్ రాసిన, ముఖ్యమైన సందర్భాలలో చేసిన ఉపన్యాసాలు,ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, గ్రంథాలు, సాహిత్యాన్ని మరింతగా ప్రచురించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంబేడ్కర్ 1927లో స్వయంగా నెలకొల్పిన తమ సమతా సైనిక్ దళ్ కార్యాలయం కోసం హైదరాబాద్ నగరంలో ఒక భవనాన్ని కేటాయించాలని, రాష్ట్రంలో నిర్మాణంలో కమ్యూనిటీ హాళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని వారు కోరారు.

సమతా సైనిక్ దళ్ ప్రముఖుల విజ్ఞప్తి పట్ల మంత్రి కొప్పుల సానుకూలంగా స్పందించారు. అంబేడ్కర్‌కు సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురింపజేసేందుకు సంపూర్ణ సహకారం అందజేస్తానని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మనమందరం కూడా మరింత కృషి చేద్దామన్నారు. కార్యాలయం ఏర్పాటును తప్పక పరిశీలిస్తానని,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తానని మంత్రి కొప్పుల హామీనిచ్చారు.

- Advertisement -