పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి:సజ్జనార్

356
sajjanar
- Advertisement -

సైబరాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (అక్టోబర్ 15-21) సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ శ్రీ సజ్జనార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు. దేశంలోని టెర్రరిజం, ఎక్స్ ట్రీమిజం ను అణచివేసి, శాంతి భద్రతలను కాపాడడం కోసం ఎంతో మంది పోలీసు ప్రాణత్యాగాలను చేశారని గుర్తు చేశారు. 1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 292 మంది పోలీసులు విధినిర్వహణలో అమరులయ్యారని పేర్కొన్నారు.

అమర వీరుల త్యాగఫలం వల్లనే ఈరోజు మనందరం ప్రశాంతంగా ఉన్నామన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉండి విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలను చేసిన పోలీస్ అమరవీరులను ప్రజలందరూ స్మరించుకోవాలన్నారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక, రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ – పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. అమరుల త్యాగాల ఫలితమే ఈరోజు సమాజంలో మనందరం ప్రశాంతమైన జీవితం గడుపుతుమన్నారు. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు.

ప్రతీఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. కొంతమందికి రక్తదానం చేయడం వల్ల బలహీనమవుతామనే అపోహ వుంది. రక్తదానంపై అపోహలు వద్దన్నారు. రక్తదానం చేస్తే మళ్లీ కొత్త రక్తం వస్తుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ నటరాజ్ 136 సార్లు, వారి కుమారుడు హెచ్ డీఎఫ్ సి స్టేట్ కార్పొరేట్ అకౌంట్స్ హెడ్ పృథ్వీరాజ్ 52 సార్లు బ్లడ్ డొనేషన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. సైబరాబాద్ పోలీసులు రక్తదానం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ సిబ్బంది, మెడికవర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గతేదాడి రక్తదానం చేసిన సీపీ సజ్జనార్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ నటరాజ్ గవర్నర్ సంతకం చేసిన సర్టిఫికేట్ ను బహూకరించారు. ఆనంతరం సీపీ గారు రక్తదానం చేశారు. సైబరాబాద్ మొత్తం మీద 200 మందికి పైగా పోలీసులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సభ్యులు 250 యూనిట్ల రక్తదానం చేశారు. అనంతరం సీపీ గారు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్లో ప్రదర్శించిన ఆయుధాలను స్థానిక స్కూల్ల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవా అన్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టాలి అన్నారు.

- Advertisement -