తెలుగు తెరకు మల్టీ స్టారర్ సినిమాలు కొత్తేమికాదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే పలకరిస్తూ వస్తున్నాయి. ఈ తరహా సినిమాలకి హీరోల ఇమేజ్ అడ్డుపడుతూ వచ్చింది. ఇక ఇటీవల కాలంలో హీరోలు విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ఉండటం వలన, మల్టీ స్టారర్ సినిమాల జోరు పెరుగుతూ వస్తోంది. ఐతే మహేష్ బాబు-వెంకటేష్ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేశాక మళ్లీ తెలుగులో మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకుంది. ఆసక్తికర కాంబినేషన్లు తెరమీదికి వస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ పీక్స్ కు వెళ్తుందని భావిస్తున్నారు. అది రావడానికంటే ముందు మీడియం రేంజిలో కొన్ని మల్టీస్టారర్లు రాబోతున్నాయి. నితిన్-శర్వానంద్ కాంబోలో ఆల్రెడీ ఒక సినిమా ఓకే కాగా.. వెంకటేష్ ఒక యువ కథానాయకుడితో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఇక మెగా ఫ్యామిలీ యువ కథానాయకుల నుంచి కూడా త్వరలోనే ఒక మల్టీస్టారర్ రాబోతుండటం విశేషం. సాయిదరమ్ తేజ్.. వరుణ్ తేజ్ కలిసి ఆ సినిమా చేస్తారట. ఇందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందట. వీళ్ల కాంబినేషన్లో సినిమా చేసేందుకు నిర్మాణ సంస్థ కూడా రెడీగా ఉందట. ఇక కావాల్సిందల్లా మంచి కథే అంటున్నాడు సాయిధరమ్. వచ్చే ఏడాదే తమ కాంబినేషన్లో సినిమా ఉండొచ్చని అతను చెప్పాడు. మరి వీళ్లిద్దరికీ సరిపోయే కథతో వచ్చే దర్శకుడెవరో చూడాలి. ఇంతకుముందు చివరగా మెగా ఫ్యామిలీ హీరోలు చేసిన మల్టీస్టారర్ అంటే.. ‘ఎవడు’నే. అందులో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లాంటిది చేశాడు. తేజు-వరుణ్ మాత్రం పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేయాలని భావిస్తున్నారు.