త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ కమల్హాసన్ మరోసారి నోరు విప్పాడు. తన రాజకీయ ప్రయాణం మొదలైనట్లేనని..తన ప్రయాణంలో కాషాయానికి(బీజేపీ)కి దూరంగా ఉంటానని ప్రకటించాడు. కేరళలో ఓ వివాహా కార్యక్రమానికి హాజరైన కమల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వామపక్ష నేతలను హీరోలు అని వ్యాఖ్యానించిన కమల్.. తాను కాషాయానికి మాత్రం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. నలభై ఏళ్లుగా సినిమాల్లో తన వేష భాషలు, హావభావాలను ప్రజలు చూశారని, అవన్నీ తాను కాషాయానికి దూరమన్న విషయాన్ని కూడా తెలుపుతాయని వ్యాఖ్యానించారు. వామపక్షాలతో కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.
రాజకీయాల్లోకి ఎంట్రీ లోపు మరింతమంది రాజకీయ నేతలను కలుస్తాను అని, వారి అభిప్రాయాలను తీసుకుంటాను అని కమల్ ప్రకటించాడు. మరి కమల్ ఎవరెవరిని కలుస్తాడు, ఇంకా ఏమేం మాట్లాడతాడు.. అనేది ఆసక్తికరంగా నిలుస్తోంది. ఇది వరకూ కమల్, అన్నాడీఎంకే పై వ్యతిరేతను వ్యక్తం చేస్తూ డీఎంకే పై సానుకూలత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ వైపు రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కమల్ స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో మరిన్ని ఉహాగానాలకు తెరలేపింది.