‘అదిరింది’తో అంత నష్టమా..!

201
S V Sekar says Mersal is 60 Crores Loss for Producer
- Advertisement -

అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు విడుదలై, భారీ విజయం సాధించిన చిత్రం ‘అదిరింది’ (తమిళంలో ‘మెర్సల్‌’). పేదలకు ఉచిత వైద్యసేవ అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో తమిళ స్టార్‌ విజయ్‌ త్రిపాత్రాభినయం చేశారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

S V Sekar says Mersal is 60 crores loss for producer

ఇక ‘అదిరింది’ చిత్రం నిర్మాతలకు రూ.60 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని నటుడు, భాజపా నేత ఎస్‌.వి.శేఖర్‌ అన్నారు. ‘‘అదిరింది’ చిత్రం వల్ల రూ.60 కోట్ల నష్టం చేకూరింది. నటుడు (విజయ్‌) తన పారితోషికం తీసుకున్నాడు. తన గత సినిమాకు రూ.3 కోట్లు తీసుకున్న దర్శకుడు (అట్లీ) దీనికి మాత్రం రూ.13 కోట్లు తీసుకున్నాడు. ఓ దర్శకుడు ముందు సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటే.. తర్వాతి సినిమాకు రూ.5 కోట్ల వరకు తీసుకోవచ్చు. కానీ ఎలా రూ.13 కోట్లు నిర్మాతల నుంచి ఆశిస్తాడు. ఈ సినిమా బడ్జెట్‌ పెరగడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి’ అని ఆయన తాజాగా ఆరోపించారు. నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపించారని అభిప్రాయపడ్డారు.

‘అదిరింది’ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. నిత్యామేనన్‌, కాజల్‌, సమంత కథానాయికల పాత్రలు పోషించారు. ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో జీఎస్టీ గురించి తప్పుగా చూపించారని పలువురు భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు సినిమాను నిషేధించాలని ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ దీన్ని కోర్టు కొట్టివేసింది. ఇది కేవలం సినిమా అని మందలించింది.

- Advertisement -