అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఊరటనిచ్చేలా, సుప్రీంకోర్టు ఆయనపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు నిరాకరించింది. పిటిషనర్లు గౌహాటి హైకోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ, ఆ హైకోర్టు అధికారాన్ని తగ్గించకూడదని వ్యాఖ్యానించింది. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో శర్మ ఒక ప్రత్యేక సముదాయానికి చెందిన వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఆయనపై పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్లో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్తో పాటు న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలి ఉన్నారు. ప్రతి అంశం కూడా సుప్రీంకోర్టుకే తీసుకురావడం ఒక “ఆందోళనకర ధోరణి”గా మారిందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనివల్ల హైకోర్టులు పర్యావరణ, వాణిజ్య సంబంధిత కేసుల విచారణల నుంచి దూరమవుతున్నాయని పేర్కొంది.
ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీనియర్ న్యాయవాదుల సౌలభ్యం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం “కన్వీనియన్స్ ఫోరమ్ షాపింగ్”గా మారుతోందని హెచ్చరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం పౌరులు తమకు సమీపంలోని హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని మరొక హైకోర్టుకు బదిలీ చేయాలనే సూచనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతి రాజకీయంగా సున్నితమైన వివాదానికి సుప్రీంకోర్టు వేదిక కాలేదని పేర్కొంది.
Also Read:అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి!
మీరు గౌహాటి హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? దాని అధికారాన్ని తగ్గించవద్దు. రాజ్యాంగ నైతికత పరిమితుల్లో ఉండాలని పార్టీలకు సూచిస్తాం. కానీ ఎన్నికల ముందు ఇటువంటి ధోరణి పెరుగుతోంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

