జియో వినియోగదారులకు షాక్‌..!

244
- Advertisement -

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో వినాయక చవితి పండుగ ముందు జియో ఫోన్ యూజర్లకు ఆ కంపెనీ షాకిచ్చింది. వినియోగదారులకు అందుబాటులో ఉండే రూ.39, రూ.69 రీచార్జ్ ప్లాన్‌లను తమ వెబ్‌సైట్, యాప్‌ల నుంచి తొలగించింది. ఈ రెండు ప్లాన్లు ప్రస్తుతం జియో వెబ్‌సైట్ లో, అలాగే మైజియో యాప్‌లో లేవు.

అలాగే కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల సహాయార్ధం జియో ప్రకటించిన ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’ (బై 1 గెట్ 1 ఫ్రీ) ఆఫర్‌ను కూడా జియో వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఈ ఆఫర్ కింద ఒకసారి రీచార్జ్ చేయించుకుంటే, ఆ తర్వాతి రీచార్జ్ ఉచితంగా లభించేది. ఈ ఆఫర్లను జియో తొలగించింది.

ఇక రూ.39 రీచార్జ్‌తో రోజుకు 100 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, భారత్‌లో ఏ నెట్‌వర్క్‌కి అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం యూజర్లకు లభించేది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. అదే రూ.69తో రీచార్జ్ చేసుకుంటే 14 రోజులపాటు రోజుకు 0.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సదుపాయం లభించేది.

వినాయక చవితి రోజున జియో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జియో ఫోన్ నెక్స్ట్’ విడుదల కానున్న నేపథ్యంలోనే కంపెనీ ఈ ప్లాన్లను తొలగించిందని మార్కెట్ నిపుణులు అనుమానిస్తున్నారు.అతి తక్కువ ధరలో 4జీ సేవలు అందించేందుకు ఈ మొబైల్‌ను జియో, గూగుల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అయితే కొత్త మొబైల్ లాంచింగ్ సమయంలో జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్లు కూడా ప్రకటిస్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -