“ఆనలుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గర్వించదగ్గ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈసందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్దమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు… పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

