కర్ణాటక రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. తమ రాజీనామాలపై స్పీకర్ స్పందించడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు. తమ రాజీనామాలను అమోదించకుండా రాజ్యంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన న్యాయస్ధానం రేపు విచారణ చేపట్టనుంది.
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్ రమేశ్ కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు. సరైన ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వాలని స్పీకర్ తెలపడంతో రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంలో పడినట్లయింది.
ఇక ఎపిసోడ్ ఇలా ఉండగానే అసమ్మతులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ముంబైలోని ఓ హోటల్కి వెళ్లగా ఆయన్ని వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా విధాన సభ ముందు ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆ పార్టీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప వెల్లడించారు. మొత్తంగా కన్నడలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎలా తెరపడుతుందో వేచిచూడాలి.