బియ్యం తీసుకోకపోతే రేష‌న్ కార్డు ర‌ద్దు- మంత్రి గంగుల

141
minister gangula
- Advertisement -

అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా బీపీఎల్ కుటుంబాల‌కు తెల్ల రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణ‌లో కోటీ 73 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయని చెప్పారు. తెల్ల రేష‌న్ కార్డుల కోసం కొత్త‌గా 9,41,641 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని వివ‌రించిన ఆయ‌న‌.. వాటిల్లో 3,59,974 మందికి ఆహార భ‌ద్ర‌తా కార్డులు జారీ చేశామ‌ని అన్నారు. 92 వేల ద‌ర‌ఖాస్తులను తిర‌స్క‌రించామ‌ని, 4,88,775 కార్డుల ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.

ఆహార భ‌ద్ర‌తా కార్డుల జారీ నిరంత‌ర ప్ర‌క్రియ అని అన్నారు. త్వ‌ర‌లో కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చే అంశం కూడా ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉందని తెలిపారు. మూడేళ్ల‌లో హైద‌రాబాద్‌లో 44,734 కార్డులు ఇచ్చామ‌న్నారు. అలాగే, న‌గ‌రంలో మ‌రో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. మెదక్‌లో 7 వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని, అలాగే, సిద్ధి పేటలో 10 వేల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని తెలిపారు. కరోనా వల్ల గత ఏడాది రేషన్‌ కార్డుల పంపిణీ ఆలస్యం అయ్యిందన్నారు. ఇక మూడు నెల‌లు వ‌రుస‌గా రేష‌న్ బియ్యం తీసుకోకపోతే రేష‌న్ కార్డు ర‌ద్దు అవుతుందన్నారు. నిజమైన అర్హులు అనివార్య కారణాల వల్ల బియ్యం తీసుకోలేక తెల్ల రేషన్ కార్డు రద్దైతే మళ్లీ వారికి కార్డు మంజూరు చేస్తామని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు.

- Advertisement -