- Advertisement -
దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. భారీ వరదల కారణంగా వందలాది నగరాలు, పట్టణాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య భాగం పూర్తిగా నీటమునిగింది. కోచి విమానాశ్రయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నది ప్రాధమిక అంచనా. రోడ్లు, కల్వర్లు, వంతెనలు ఇలా ఒక్కటేమిటి జలవిలయానికి అన్నీ ధ్వంసమయ్యాయి.

సర్వం కోల్పోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు తమ వంతుగా సాయమందించారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు ముందుకొచ్చారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు సాయమందించారు. తమిళ హీరో విజయ్, టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్బాబు తదితర హీరోలు విరాళమందించగా, హీరోయిన్ కీర్తి సురేష్ తన వంతు సాయంగా 15 లక్షలు అందించారు.

ఇప్పుడు తాజాగా మరో నటుడు వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సాయమందించాడు. కష్టం ఉన్న వారికి అండగా తానున్నానంటూ ఎప్పుడు అండగా ఉండే లారెన్స్ ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసారు . 140కి పైగా చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా కేరళ వరద బాధితులకి ఏకంగా కోటి రూపాయాల సహాయార్థం ప్రకటించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం.శనివారం కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి తాను కోటి రూపాయల విరాళాన్ని అందించనున్నట్టు లారెన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రజలని డైరెక్ట్గా కలిసి వారికి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి అనుమతి కూడా తీసుకుంటానని లారెన్స్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
- Advertisement -

