రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్లోబల్ రాజకీయాల లక్ష్యం మానవసేవ కావాలని భారత్ విశ్వసిస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిని సమర్థంగా ఎదుర్కొని, ప్రజాధనాన్ని సరైన విధంగా వినియోగించిందని చెప్పారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, ఫేక్ కంటెంట్ ప్రజాస్వామ్యం మరియు సామాజిక సౌహార్దానికి పెద్ద ముప్పుగా మారాయని హెచ్చరించారు.
ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజన సమాజం సహా ప్రతి ఒక్కరి కోసం పూర్తి సున్నితత్వంతో పని చేస్తోంది. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ దృష్టికోణం ప్రతి పౌరుడి జీవితంపై సానుకూల ప్రభావం చూపుతోంది. 2014 ప్రారంభంలో సామాజిక భద్రత పథకాలు కేవలం 25 కోట్ల మందికే చేరాయి. ఇప్పుడు ప్రభుత్వ ప్రయత్నాల వల్ల సుమారు 95 కోట్ల మంది భారతీయులకు సామాజిక భద్రత అందుబాటులోకి వచ్చింది అని రాష్ట్రపతి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కోసం ‘విక్సిత్ భారత్–గ్రామ్ జీ రామ్ జీ’ చట్టాన్ని రూపొందించామని, ఈ సంస్కరణతో గ్రామాల్లో 125 రోజుల ఉపాధి హామీ లభిస్తుందని ఆమె చెప్పారు. ప్రగతిశీల ఆలోచన విధానం, విధానాల ఫలితంగా దేశంలోని ప్రతి ఆశయ రంగంలో మహిళలు వేగంగా ముందుకు వెళ్లారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇటీవలే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి తొలి మహిళా కేడెట్ల బ్యాచ్ ఉత్తీర్ణత సాధించడం దేశానికి మరో కీలక మైలురాయిగా నిలిచింది. దేశ అభివృద్ధి, సాధికారతలో ‘నారి శక్తి’ ముందుంటుందనే విశ్వాసం మరింత బలపడింది అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిజమైన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి వెల్లడించారు.
Also Read:మరోసారి బంగారం భగభగ

