సంజయ్‌ మగాడైతే…కేంద్రంతో ధాన్యం కొనిపించాలి

83
- Advertisement -

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మగాడైతే…కేంద్రంతో తెలంగాణ ధాన్యం కొనిపించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు వరి వేయాలని…కేంద్రంతో పంట కొనిపించే బాధ్యత నాదే అని స్వయంగా బండి సంజయ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల, పువ్వాడ అజయ్ లతో కలిసి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో రైతులను రెచ్చగొట్టి వరి వేయాలన్న ఆయన ఇప్పుడు రాష్ట్రం సహకరించకుంటే ఎలా కొంటామంటున్నారని ఆయన మాట్లాడిన మాటల ఆడియో వినిపించారు. రోజుకో మాట మాట్లాడే వ్యక్తి అసలు మనిషేనా? అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు కోరినట్లు సహకరిస్తుందని…మగాడివైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని బండి సంజయ్ కి మంత్రి వేముల సవాల్ చేశారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై గౌరవం ఉందన్నారు. ఐతే బండి సంజయ్ లాంటి వాళ్ల తెలివి తక్కువ మాటలు విని తాను వెనుకబడిపోయానేమోనని కిషన్ రెడ్డి కూడా అబద్దాలు చెప్పటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో కిషన్ రెడ్డి పోరాడాలని వేముల కోరారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు అంతా కండకావరమా! అని వేముల అన్నారు. వెంటనే తన మాటలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో కేంద్రాన్ని ఒక్క మాట అడగటం లేదన్నారు. ఈ విషయంలో అటు బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటయ్యాయని విమర్శించారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…తెలంగాణలో పండించిన రెండో పంట కొనాలని ఐదుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వెళ్లిన ప్రతిసారీ తమను అవమానిస్తూ, అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రజలను అవమానించి వాళ్లంతా అంతకంత అనుభవిస్తారని గంగుల కమలాకర్ శాపం పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసి ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనటంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిస్తేనే ధాన్యం కొంటామని తమ మెడపై కత్తి పెట్టి సంతకం చేయించకున్నారని గుర్తు చేశారు. అప్పటికే ప్రభుత్వం రైతులకు, మిల్లర్లకు డబ్బులు ఇవ్వటం కారణంగా కేంద్రం ఇష్టమొచ్చినట్లు రాసిన అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి వచ్చిందన్నారు. అసలు తెలంగాణ బిడ్డ అయిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి ప్రాంతాల ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

ఇప్పటికీ గతేడాది రైస్ తెలంగాణ పంపించటం లేదని కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ మూడు నెలల్లో సాధ్యమా అని గంగుల ప్రశ్నించారు. సాధారణంగా ఏటా ఏడాది ఎక్స్ టెన్షన్ చేస్తుంటారని…మూడు నెలల్లో బియ్యం సేకరణ సాధ్యం కాదని తెలిసి కూడా కావాలనే కేంద్రం అలా చేసిందన్నారు. ఇప్పటికీ కూడా రా రైస్ కూడా కొనలేదన్నారు. అబద్దాలు మానుకోని తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా రెండో పంట ధాన్యాన్ని కూడా కొనాలని గంగుల డిమాండ్ చేశారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారు.. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతాం. ఉగాది తర్వాత నూకెవరు ? పొట్టు ఎవరు తేలుస్తాం. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ప్రజలకు నూకలు తినిపించి చూడాలి.. లేదా పీయూష్ గోయల్ తో క్షమాపణ చెప్పించాలి. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలి. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష్యతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని భావిస్తే అది శునకానందమే అవుతుంది అన్నారు.

- Advertisement -