ప్రశ్నించే అలవాటు మర్చిపోతున్న జర్నలిస్టులు..

207
Prakash Raj Lashes Out BJP
- Advertisement -

మనిషి కంటే గోవే ముఖ్యమా అని ప్రశ్నించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. కర్ణాటకలోని శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్..జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గోహత్య చేసేవారు తల్లి తల నరికిన వారితో సమానమంటూ కన్నడ నటుడు చిరంజీవి సర్జా నటించిన సీజర్‌ చిత్రంలో గోహత్యపై ఆక్షేపణార్హమైన మాటలు రాశారని ప్రకాశ్‌రాజ్‌ విమర్శించారు. తాను ఏ పార్టీకి చెందిన నాయకుడినీ కాదని, అణగారిన వర్గాలకు మాత్రమే మద్దతుగా నిలుస్తానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి, అధికారంలోకి వచ్చిన కొందరు నాయకులు ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోల్చుతున్నారని… కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాను వెళ్లిన చోటల్లా కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గోవు, కొబ్బరికాయ ఎప్పుడు హిందూ మతం పుచ్చుకున్నాయి? ఖర్జూరం, గొర్రె ఎప్పుడు ముస్లిం ధర్మంలోకి చేరాయి? పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి? అని ప్రశ్నించారు. ఆహార పద్ధతి గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించటం లేదా? అని ప్రశ్నించారు.

- Advertisement -