మోదీ ఆఫీసు అమ్ముతున్నట్లు OLX లో ప్రకటన..!

153
PM Modi’s office
- Advertisement -

ప్రధాని మోదీ ఆఫీసును అమ్మకానికి పెట్టేశారు. మోదీ ఆఫీసు అమ్మడం ఏంటనేగా మీ సందేహం. అసలు విషయం ఏంటంటే.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. వారణాసిలోని ఓ విల్లాలో మోదీ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయాన్ని నలుగురు ప్రబుద్ధులు ఓఎల్ఎక్స్ లో ఏకంగా అమ్మకానికి పెట్టేశారు. ఓఎల్ఎక్స్‌లో ఇచ్చిన ప్రకటనలో, 6,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాగల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య ముఖ ద్వారం ఉన్న ఈ ఇంట్లో రెండు అంతస్థులు ఉన్నాయని, కార్ పార్కింగ్ కూడా ఉందని అందులో ఉంది. ఈ విల్లాను రూ. 7.5 కోట్లకు అమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులు షాక్‌ తిన్నారు. ప్రధాని ఆఫీసును అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన వచ్చిందని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఓఎల్ఎక్స్ లో ప్రకటనను తొలగింపజేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. దీనికి బాధ్యులైన నలుగురిని గుర్తించి, అరెస్ట్ చేశారు. వారణాసి ఎస్ఎస్‌పీ అమిత్ కుమార్ పాఠక్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగుర్ని అరెస్టు చేశారు. ఈ ప్రకటన కోసం ఈ విల్లాను ఫొటో తీసిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

- Advertisement -