కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని… అనేక దశాబ్దాల తర్వాత దేశం పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి ఓటేసిందన్నారు మోడీ.
కరోనా దేశంలోకి వచ్చినప్పుడు.. భారత్ ప్రపంచానికి సమస్యగా మారుతుందని భయపడ్డారు.. కానీ, నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందన్నారు. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు.
కరోనా కారణంగా వలస కార్మికులు, కూలీలు, ఇతరులు విపరీతమైన బాధలు అనుభవించారని… ఈ సంక్షోభంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగలేదని తాము చెప్పడం లేదన్నారు . లాక్డౌన్తో వేల సంఖ్యలో వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.
తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని ప్రస్తావించిన మోడీ….జాతీయ ఐక్యత మరియు సమైక్యత యొక్క స్ఫూర్తిని పెంపొందించిందన్నారు. గత ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేసుకున్నారు.

