ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ భేష్‌..

253
telangana
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన ఆన్లైన్ ఆడిట్ విధానంలో తెలంగాణ ఆడిట్ శాఖ గ్రామ పంచాయితిలలో లేవనెత్తిన ఆడిట్ అభ్యంతరాలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్ర పంచాయితి రాజ్ శాఖ జాయింట్ సెక్రటరి కె యస్ సేథీ తెలంగాణ ఆర్ధిక, ఆడిట్ శాఖ, పంచాయతి రాజ్ శాఖలకు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో 2019-20 ఆడిట్ సంవత్సరంలో 12769 గ్రామపంచాయితీలకు గాను 5174 గ్రామపంచాయితి లను ఆన్లైన్‌లో ఆడిట్ చేసి నివేదికలను, 56505 అభ్యంతరాలని ఆన్లైన్‌లో ఆడిట్ శాఖ అందించారని తెలిపారు. ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై సరైన సమాధానాలు రాయాలని ఆదేశించారు. ఆన్లైన్ ఆడిట్‌లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని అభినందించారు. ఆర్ధిక శాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతి రాజ్ శాఖలు సమన్మయంతో పనిచేశాయని కొనియాడారు. త్వరలో కేంద్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి ఎదుట తెలంగాణ ఆడిట్ శాఖ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుని ఆన్లైన్ ఆడిట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆయన కోరారు.

కరోనా సమయంలో 25 రాష్ట్రాలలోని పంచాయితి రాజ్ లోకల్ బాడీస్‌కి 8923.80 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ గ్రాంట్‌ను ఈ 2020-21 ఆడిట్ సంవత్సరంలో ఆన్లైన్ ఆడిట్ చేయాలని కోరారు. ఆడిట్ నివేదికల ఆధారంగా రానున్న రోజుల్లో కేంద్రం నిధులు విడుదల చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా 2019-20 ఆడిట్ సంవత్సరంలో 56505 అభ్యంతరాలని ఆన్లైన్ లో ఆడిట్ శాఖ అందించారని తెలుపుతూ, గ్రామపంచాయితిలలో చేసిన పనులలో ఆదాయ పన్ను, జి యస్ టి, నాక్, ఇతర తగ్గింపులు చేసి ప్రభుత్వ శాఖలకు జమ చేయని అభ్యంతరాలు 25979 అని లేఖలో పేర్కొన్నారు. అలాగే నిభందనల అతిక్రమణ ఫై అభ్యంతరాలు 16947 అని, జి యస్ టి తగ్గించకుండా చెల్లించిన నగదుని అభ్యంతరపరచి 6316 అభ్యంతరాలుగా నమోదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రంధాలయ సెస్సు వసూళ్ళు చేసి ఆ శాఖకు జమ చేయకుండా ఉన్ననగదుని అభ్యంతరపరచి 4632 అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నిభందనలు పాటించకుండా చేసిన ఖర్చులను అభ్యంతరపరచి 9136 అభ్యంత రాలు నమోదు చేసినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్షంపై అభ్యంతరపరచి 7165 అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేఖలో పేర్కన్నారు.

ఇకపై ఆన్లైన్ లోనే గ్రామ పంచాయితిల ఆడిట్ నిర్వహించాలని కేంద్ర పంచాయితి రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సేథీ రాష్ట్రాలను ఆదేశించారు. వంద శాతం ఆన్లైన్ లో గ్రామపంచాయితిలు ఆడిట్ చేసేలా తెలంగాణ ఆడిట్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ లో గ్రామ పంచాయితిలను ఆడిట్ చేయడంతో కేంద్రం నిధులు గ్రామ పంచాయితిలలో ఖర్చు చేస్తున్న విధానం తెలుసుకునేందుకు వీలు అవుతుందని, అవినీతికి తావు ఉండదని తెలిపారు. కేంద్ర పంచాయితి రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సేథీ లేఖ నేపద్యంలో తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు గ్రామ పంచాయితిల ఆడిట్ ఆన్లైన్ లోనే చేసేలా చూడాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ఈ ఏడాది కూడా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని తెలంగాణ ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రము లోని 12769 గ్రామపంచాయితిలు ఆడిట్ ఆన్లైన్ లో చేసేలా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -