పాలకుర్తి నియోజకవర్గంలోని సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అభివృద్ధి పనులపై వారికి దిశానిర్దేశం చేసిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అన్నారు.
సపాయిల జీతాలను రూ.8,500లకు పెంచినట్లు తెలిపారు. పంచాయతీల్లో ఇప్పుడు అమలవుతున్న నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కల్లాలు, రైతు వేదికలు, నిరంతర పారిశుద్ధ్యం, మ్యూటేషన్, ఇతర అన్ని రకాల అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను లాటరీ పద్ధతిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిజమైన పేదవారిని ఎంపిక చేసి, వారిలోనూ లబ్ధిదారులకు లాటరీ పద్ధతి పాటిస్తే ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.