ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పురస్కార గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేశారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన వారికి అవార్డులను అందజేశారు.
సంగీత సామ్రాట్ ఇళయరాజా, హిందూత్వ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ పరమేశ్వరన్ సహా 41 మంది ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఈ ఏడాది ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ సహా 84 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడి, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.
ఏటా గణతంత్ర దినోత్సవంనాడు వీటిని ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ, వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందిస్తారు.