పంటల పండుగైన ఓనం వేడుకల్లో అరటి ఆకులో వడ్డించే అద్భుతమైన శాకాహార విందు ‘ఓణం సద్య’. ఇది కేరళ సంప్రదాయానికి ప్రతీక. ఈ విందు తీపి, పులుపు, ఉప్పదనం, చేదు, కారం, వగరు అనే ఆరు రుచులను (షడ్రుచులు) అద్భుతంగా సమతుల్యం చేస్తుంది. కొబ్బరితో చేసే అవియల్ నుంచి తీపి పాయసం వరకు.. ప్రతి వంటకం శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఓణం పండుగ నాడు కేరళ రుచులను మీ ముందుకు తీసుకొచ్చే ముఖ్యమైన వంటకాలు ఇవే..
అవియల్:
ఓనం సద్య అనగానే ముందుగా గుర్తొచ్చే వంటకం అవియల్. కొబ్బరి, పచ్చిమిర్చి, పెరుగు, పలు రకాల కూరగాయలతో తయారుచేసే ఈ వంటకం భోజనంలో ఉన్న ఇతర ఘాటైన రుచులకు చక్కటి బ్యాలెన్స్ ఇస్తుంది.
సాంబార్:
సాంబార్ లేని ఓనం సద్య అసంపూర్ణమే. పప్పు, కూరగాయలు, సువాసన వెదజల్లే మసాలా దినుసుల మిశ్రమంతో దీన్ని తయారుచేస్తారు. వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ కలుపుకుని తింటుంటే వచ్చే రుచే వేరు.
ఓలన్:
బూడిద గుమ్మడికాయ, అలసందలను కొబ్బరి పాలతో కలిపి అత్యంత సున్నితమైన రుచితో ఈ వంటకాన్ని చేస్తారు. ఇతర ఘాటైన కూరల రుచికి ఇది స్వాంతననిస్తుంది.
తోరన్:
సన్నగా తరిగిన కూరగాయలకు తురిమిన కొబ్బరి, కరివేపాకు, సుగంధ ద్రవ్యాలను వేసి వేయిస్తారు. ప్రాంతాన్ని బట్టి క్యాబేజీ, బీన్స్, క్యారెట్ తదితర కూరగాయలను వాడతారు.
పచ్చడి, కిచ్చడి:
అనాసపండు (పైనాపిల్), కీరదోస లేదా బీట్రూట్కు పెరుగు, కొబ్బరి కలిపి చేసే ఈ పచ్చడి, కిచ్చడిలు భోజనానికి అత్యంత ప్రత్యేకమైన, రిఫ్రెష్ అయిన పుల్లటి రుచిని అందిస్తాయి.
పప్పు కూర (పారిప్పు కర్రీ):
నెయ్యి వేసిన వేడి అన్నంలోకి ఈ పప్పు కర్రీ భోజనంలో అత్యంత సాదాసీదాగా ఉండి అద్భుతమైన కాంబినేషన్ను ఇస్తుంది.
ఊరగాయ, అప్పడాలు, అరటికాయ చిప్స్:
సాంబార్, పప్పు లాంటి ప్రధాన వంటకాలకి జతగా ఘాటైన ఊరగాయలు, కరకరలాడే అప్పడాలు, అరటికాయ చిప్స్ ప్రతి ముద్దకి ఓ కొత్త అనుభూతిని ఇస్తాయి.
అన్నం:
అరటి ఆకు మధ్యలో వడ్డించిన అన్నం చుట్టూ ఈ కూరలన్నీ అలంకరించబడి ఉంటాయి. అన్నంతో ఏ కూరను కలుపుకుని తినాలో మన ఇష్టానికే వదిలేస్తుంది.
Also Read:క్రీడలకు మరింత ప్రాధాన్యం:మోదీ
పాయసం:
ఎంత పెద్ద విందుకైనా పాయసంతోనే అసలైన ముగింపు. పాలు, బియ్యం, బెల్లం, సుగంధ ద్రవ్యాలతో చేసే పాలడ పాయసం, అడ ప్రధమన్ పాయసాలు అద్భుతమైన తీపితో పండుగ భోజనానికి ఘనమైన ముగింపును ఇస్తాయి.

