TTDP:తెలంగాణలో టీడీపీ కనుమరుగు?

20
- Advertisement -

తెలంగాణలో టీడీపీ కనుమరుగు కానుందా ? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువ భాగం ఏపీ పైనే ఫోకస్ చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో నామమాత్రంగా పోటీలో ఉంటూ వచ్చింది. 2014,2019 ఎన్నికల్లో పోటీ చేసి కొంతమేర సీట్లు కూడా సాధించింది. కానీ అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరం పాటించింది. మొదట పోటీ చేయాలనే దిశగా చంద్రబాబు ప్రయత్నించారు. అయితే ఆ టైమ్ లో చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉండడంతో ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంది తెలుగుదేశం పార్టీ.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా టీడీపీ పోటీ చేస్తుందని భావించారంతా. కానీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కూడా దూరంగా ఉండేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరగనుండడంతో పూర్తి ఫోకస్ అంతా కూడా ఏపీపైనే కేంద్రీకరించాలానే ఉద్దేశ్యంలో బాబు ఉన్నట్లు వినికిడి. పైగా ఈసారి ఏపీ ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి. ఎందుకంటే ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

అందువల్ల 2029 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లో ఉండడం ప్రశ్నార్థకమే. అందుకే ఏపీ పైనే దృష్టి సారిస్తూ తెలంగాణను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీ కి కొంత బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండడం వల్ల ఎంతో కొంత ఉన్న ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే ప్రయత్నం చేసిన పెద్దగా ఫలితం ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి ఎన్నికలకు దూరమైతే ముందు రోజుల్లో టీడీపీ తెలంగాణలో కనుమరుగైన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.

Also Read:కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

- Advertisement -