నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామ్ ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ గడువు జూన్ 28తో ముగియడంతో ఫైనల్ కీ మరియు ఫలితాల విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పరీక్ష నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రస్తుతం ఫలితాలను ఖరారు చేసే పనిలో ఉందని, వీటిని “వీలైనంత త్వరగా ప్రకటిస్తామని” తెలిపింది.
దేశవ్యాప్తంగా జూన్ 21న ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్కు దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ మరియు ప్రశ్నాపత్రాలను ఎన్టీఏ జూన్ 25న తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కీపై అభ్యంతరాలను తెలియజేయడానికి జూన్ 25 నుండి జూన్ 28 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
ఎన్టీఏ విడుదల చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం… ఈ ఏడాది పారదర్శకతను పెంచడం కోసం ఓఎంఆర్ (OMR) జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే, సమాంతరంగా ఆన్సర్ కీ ఛాలెంజ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. అభ్యర్థుల ప్రయోజనాలను మరియు పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ప్రతి అభ్యర్థికి నాలుగు సెట్ల ప్రాథమిక కీలను ముందుగానే సమీక్షించుకునే అవకాశం లభిస్తుంది. తమ దృష్టిలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా అనిపిస్తే, దానిని వెంటనే మా దృష్టికి తీసుకురావచ్చు అని ఎన్టీఏ పేర్కొంది.
ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా, అభ్యంతరాలపై నిపుణుల సమీక్షను ముందే ప్రారంభించడం ద్వారా సమయం ఆదా అవుతుందని ఎన్టీఏ తెలిపింది. ఈ సరికొత్త విధానం వల్ల ఫైనల్ ఆన్సర్ కీని మరియు ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి వీలవుతుందని ఏజెన్సీ స్పష్టం చేసింది.
Also Read:ట్రెండింగ్లో ‘ఇరుముడి’ సాంగ్

