పార్టీ ఒకరిది.. ఫలితం మరొకరిది!

15
- Advertisement -

మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ మద్య రాజకీయ విభేదాల కారణంగా ఎన్సీపీ రెండుగా చీలిన సంగతి విధితమే. పార్టీ అధినేత శరత్ పవార్ ను విభేదిస్తూ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ 20 మంది ఎమ్మెల్యేలతో షిండే వర్గంలో చేరడంతో ఎన్సీపీ రెండుగా చీలింది. అప్పటి నుంచి శరత్ పవార్ వర్గం,అజిత్ పవార్ వర్గం అని రెండు వర్గాలుగా ఎన్సీపీ విడిపోయింది. అజిత్ పవార్ ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపిన తరువాత డిప్యూటీ సి‌ఎంగా ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసలే బలహీన పడిన ఎన్సీపీని మరింత బలహీన పరిచేందుకు అజిత్ పవార్ గట్టిగానే ప్రయత్నిస్తూ వచ్చారు. ఎన్సీపీలోని మిగిలిన ఎమ్మెల్యేలను సైతం తనవైపుగా ఆకర్షించే ప్రయత్నం చేశారు.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్సీపీ బలహీన పడదని శరత్ పవార్ చెబుతూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల కమిషన్ శరత్ పవార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు రెండిటినీ అజిత్ పవార్ వర్గానికి కేటాయించింది. దీంతో ఊహించని ఈ పరిణామానికి కంగు తిన్న శరత్ పవార్ ఈసీ మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు. పార్టీ స్థాపించిన వారికే పార్టీని దక్కకుండా చేయడం అప్రజాస్వామికం అంటూ మండి పడ్డారు. ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈసీ తాజా ప్రకటనతో అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ వర్గంగా తేలిపోయింది, దీంతో పార్టీని స్థాపించి వ్యవస్థపకుడిగా ఉన్న శరత్ పవార్ వర్గం ఎన్సీపీకి దూరమైంది. మరి సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరత్ పవార్ కు న్యాయం జరుగుతుందా ? లేదా సంఖ్య బలం అధికంగా ఉన్న అజిత్ పవార్ కే తీర్పు అనుకూలంగా వస్తుందా ? అనేది ముందు రోజుల్లో తేలనుంది.

Also Read:Devara:దేవర..అసలేం జరుగుతోంది?

- Advertisement -