మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్( Devendra Fadnavis) ముంబైలో జరిగిన ‘ముంబై క్లైమేట్ వీక్ 2026’ తొలి ఎడిషన్ను ప్రారంభించారు. బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పులపై చర్చలకే పరిమితం కాకుండా, ఆచరణాత్మక చర్యలకు దారితీయడమే ఈ సమ్మిట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే, ముంబై మేయర్ రితు తావ్డే, ఎంఎంఆర్డీఏ కమిషనర్ సంజయ్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.
ముంబైను గ్లోబల్ సౌత్ దేశాలకు వాతావరణ నాయకత్వ కేంద్రంగా నిలబెట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. 30కిపైగా దేశాల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, వ్యాపారవేత్తలు, పర్యావరణ నిపుణులు, యువజన సంస్థలు ఇందులో పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని ‘ప్రాజెక్ట్ ముంబై’ అనే ఎన్జీవో మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 18న ప్రత్యేక అంతరిక్ష సెషన్లో భారత అంతరిక్ష వీరులు రాకేష్ శర్మ, శుభాంశు శుక్లా విద్యార్థులతో చర్చించనున్నారు. హిల్లరీ క్లింటన్, బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

