హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ల్ల్లో మహా మోసం బయటపడింది. నగరంలోని సినీ మల్టీప్లెక్స్ లపై ఏకకాలంలో తూనికలు – కొలతల శాఖ అధికారుల దాడులు జరిపారు. తినుబండారాలు – శీతల పానీయాలతో పాటు ఇతరు ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఐమ్యాక్స్ లో దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట – అమీర్ పేట్ – దిల్ సుఖ్ నగర్ – శామీర్ పేట్ – కూకట్ పల్లి – మాదాపూర్ – బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ఎమ్మార్పీ కంటె అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై 8 కేసులు నమోదు చేశారు.
సినిమా చూసేందుకు వెళ్లే ప్రేక్షకుడు తినుబండారాలో, శీతలపానీయాలో కొనుక్కోవాలనుకుంటే థియేటర్లో వాటి ధరలు బయటికంటే రెట్టింపు ఉండొచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిని బట్టి అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు! అక్కడ ఎమ్మార్పీ ధరలనేవి పెద్ద జోక్! వాటి గురించి ప్రశ్నించిన వాడు పిచ్చోడు! జవాబు కూడా చెప్పకుండా పక్కకు తోసేస్తారు! బయటి కంటే మూడు రెట్లు ఎక్కువగా ధరలు పెంచి అమ్ముతారు! సినిమా టికెట్ ధరలే అదిరిపోతుంటే.. విశ్రాంతి సమయంలో తిను బండారాలకు వసూలు చేస్తున్న ధరలు చూస్తే కళ్లు తిరిగిపోతాయి. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ల్లోని దోపిడీపై దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన, ఆందోళన, అసంతృప్తి నెలకొంది.
ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. అందుకే, ఆదివారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్ల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐనాక్స్, ప్రసాద్ ఐమాక్స్, జీవీకే, ఇనార్బిట్, ఫోరం మాల్, ఐకాన్ హైటెక్ సిటీ, లియోనియా కార్నివాల్, ఏషియన్ జీపీఆర్, పీవీఆర్, సినీ పొలీస్, సీసీపీఎల్ కార్నివాల్, పీవీఆర్ ఐకాన్ హైటెక్ సిటీ, దిల్సుక్నగర్ మిరాజ్ థియేటర్, ఏషియన్ మల్టీప్లెక్స్, మహేశ్వరి, పీవీఆర్ నెక్ట్స్ గలేరియా, ఏషియన్ జీపీఆర్ కూకట్పల్లి తదితర థియేటర్లలో తనిఖీలు జరిపారు. మల్టీఫ్లెక్స్ లలో మోసాలపై వినియోగదారులు 7330774444 నంబర్కు ఫిర్యాదు చేయాలని అకున్ సభర్వాల్ తెలిపారు. వినియోగదారులు మోసపోకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలని అధికారులకు స్పష్టం చేశారు.