ఇదేం ట్విస్టూ.. జనసేనలోకి ముద్రగడ?

27
- Advertisement -

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల చుట్టూ జంపింగ్ జపాంగ్ రాజకీయం తెగ హాట్ టాపిక్ అవుతోంది. అధికార వైసీపీ నుంచి కొంతమంది నేతలు టీడీపీ వైపు వెళుతుంటే టీడీపీలో సీటు దగ్గని కేశినేని నాని వంటి వారు వైసీపీలో చేరుతున్నారు. ఇక ఈసారి సత్తా చాటలని చూస్తున్న అంబటి రాయుడు వంటివారు జనసేన వైపు చూస్తున్నారు. ఇక మూడు పార్టీల చుట్టూ వలసల పర్వం గట్టిగానే కొనసాగుతోంది. ఇకపోతే కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరతారని గట్టిగా వార్తలు వినిపించాయి. ఆయన కోసం జగన్ సీటు కేటాయించారని పవన్ ఎక్కడ పోటీ చేస్తే అదే స్థానంలో ముద్రగడను రంగంలోకి దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కాపు సామాజిక వర్గంలో బలమైన ముద్ర వేయగల ముద్రగడ 2009 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. .

కానీ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఓ వార్త రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ముద్రగడ వైసీపీ కాదని జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. జనసేనలో చేరితే కాపు సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, రాజకీయంగా కూడా తనకు భవిష్యత్ ఉంటుందని ముద్రగడ ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పవన్ తో ముద్రగడ భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇదే గనుక నిజం అయితే రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీలో నిలిచారు ముద్రగడ.. మెగా కుటుంబంతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఆయన ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నట్లు వినికిడి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read:దళిత బంధుపై కాంగ్రెస్‌ను నిలదీద్దాం:సత్యవతి

- Advertisement -