డీ శ్రీనివాస్‌పై ఎంపీ కవిత ఆగ్రహం..

246
MP Kavitha
- Advertisement -

నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ సభ్యడు, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌పై జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో ఎంపీ కవిత నివాసంలో బుధవారం పార్టీ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. డీఎస్‌ వ్యవహారశైలిపై చర్చించిన నేతలు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రికి సిఫార్స్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

MP Kavitha

డి. శ్రీనివాస్ వ్యవహార శైలిపై నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆమె టీఆర్‌ఎస్ పార్టీని నిలబెట్టిన ఘనత నిజామాబాద్ జిల్లాది అని తెలిపారు. పార్టీలోకి వస్తానంటే డీఎస్‌ను పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్‌ను అవమానపరిస్తే టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా చేసి గౌరవించింది అని పేర్కొన్నారు.

కుటుంబ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుంటే డీఎస్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. డీఎస్ పరిణామాలు కార్యకర్తల్లో అయోమయానికి గురి చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉండి ఇతర పార్టీలో చేరాలని డీఎస్ చెప్పడం సరికాదన్నారు. డీఎస్ వ్యవహార శైలిపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తుల ఉమను కోరామని కవిత తెలిపారు. కుటుంబాన్ని కంట్రోల్ చేయలేని వ్యక్తి పార్టీలో ఎలా కొనసాగుతారని ఆమె ప్రశ్నించారు. ఒక కుటుంబం గురించి పార్టీ నష్టపోవడం సరికాదని కవిత చెప్పారు.

- Advertisement -